Site icon Bhakthi TV

అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పై కప్పు నుంచి కారుతున్న నీరు..

అయోధ్య రామమందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. తాజాగా అయోధ్యలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే నీరు సరిగ్గా రామ్ లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి, వీఐపీలు దర్శనం చేసుకునే చోట కారుతోందని ఆలయ ప్రధాన పూజారి తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నేతృత్వంలో చేపట్టిన ఈ రామ మందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,800 కోట్లు. అయితే ఈ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సత్యేంద్ర దాస్ చెబుతున్నారు.

ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు బయటకు పోయేందుకు ఏర్పాట్లను సైతం సరిగా చేయలేదని సత్యేంద్ర దాస్ ఆరోపిస్తున్నారు. పైకప్పు లీకేజీ సమాచారాన్ని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రాకు ఆలయ అధికారులు అందజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్నా మిశ్రా ఆలయ పైకప్పుని వాటర్ ప్రూఫ్‌గా మార్చాలని సూచించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా బాలరామయ్య ప్రాణ ప్రతిష్ట జరిగింది. అది జరిగి ఆరు నెలలు తిరగక ముందే ఇలా పైకప్పు నుంచి నీరు కారడం ఆసక్తికరంగా మారింది.

Share this post with your friends
Exit mobile version