Site icon Bhakthi TV

భక్తులకు పెట్టే అన్నం రుచిని పెంపొందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు

తిరుమలకు విచ్చేసే వేలాదిమంది శ్రీ వేంకటేశ్వర స్వామివారి భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామల రావు రైస్ మిల్లర్లను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్‌మిల్లర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు. తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చు అన్నారు.

అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలు దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు. ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రకుమార్, ప్రత్యేక అధికారి (కేటరింగ్) శ్రీ శాస్త్రి,ఈఈ ప్రొక్యూర్‌మెంట్ శ్రీ మురళీకృష్ణ, ఏపీ, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version