Site icon Bhakthi TV

తిరుమలలో భక్తులకు కీలక సూచన చేసిన టీటీడీ..

తిరుమలకు వస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలో రాబోవు రోజుల్లో నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉందని టీటీడీ చెబుతోంది. స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి, తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం నాడు తిరుమలలో పత్రికా ప్రకటనను విడుదల చేసింది. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు.

అందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్‌ల నుంచి మిగిలిన నీటిని తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి సేకరిస్తారు. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు భక్తులు మరియు స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Share this post with your friends
Exit mobile version