
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ తరపున ఈవో శ్రీ జె.శ్యామలరావు దంపతులు ఆదివారం స్వామివారికి శేషవస్త్రం సమర్పించారు.హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆనవాయితీగా సమర్పిస్తోంది.
సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీ రాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి. ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి ఈవో శ్రీ జె శ్యామలరావు శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు ఈవో దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.
