
కొన్ని ఆలయాలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో.. ప్రకృతి ఒడిలో చూడటానికే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే ఆలయం ప్రశాంతమైన వాతావరణంలోనే కాదు. చుట్టూ నీరు.. నీటి మధ్యలో కొండపై స్వామివారు కొలువై ఉంటారు. ఆయనను దర్శించుకోవాలంటే అన్ని ఆలయాలకు వెళ్లినట్టు నడుచుకుంటూ వెళ్లిపోతే కుదరదు. బోటు ఎక్కి వెళ్లాల్సిందే. అయినా సరే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అసలు ఇంతకీ ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయంలో ఏ దేవుడు కొలువై ఉంటాడో తెలుసుకుందాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలోని వరదవెల్లి కొండపై స్వయంభుగా దత్తాత్రేయ స్వామి వెలిశారు. స్వామివారు ఇప్పుడు కాదు.. 400 ఏళ్ల క్రితమే వెలిశారని స్థానికులు చెబుతున్నారు. రాహు కేతు శయన అవతారంలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇలాంటి ఆలయాలు భారత దేశంలో చాలా అరుదుగా ఉంటాయి. ఈ ఆలయంలో దత్తాత్రేయ స్వామివారి విగ్రహం పడుకుని నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది. స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. స్వామివారి దర్శనానికి బోటులో భక్తులు వస్తుంటారు. అప్పట్లో అయితే నీరు తగ్గినప్పుడు మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు. ఆ తరువాత బోట్లు అందుబాటులోకి వచ్చాయి.
