Site icon Bhakthi TV

16 నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు సెప్టెంబరు 15వ తేదీ సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం జరుగనుంది. ఆల‌యంలో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా సెప్టెంబరు 16వ తేదీన పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సెప్టెంబరు 15వ తేదీన అంకురార్పణ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 16వ తేదీ అష్టదళ పాద పద్మారాధన సేవలను రద్దు చేశారు. ఆదేవిధంగా సెప్టెంబరు 16, 17, 18వ తేదీలలో కల్యాణోత్సవం, బ్రేక్‌ దర్శనం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఊంజల్‌సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Share this post with your friends
Exit mobile version