Site icon Bhakthi TV

ఈ శివయ్య పాక్‌లో కొలువు దీరాడు.. విశేషమేంటంటే..

ప్రాంతీయ భావన మనకు ఉంటుంది కానీ దేవతలకు ఉండదు కదా. ఎల్లలు దాటి మరీ పూజలందుకుంటూ ఉంటారు. ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లోని సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతూ ఉంటుంది. అయితే దేశ విభజన అనంతరం కొందరు హిందువులు పాక్‌కి వెళ్లిపోయారు. పాక్‌లోనూ హిందూ దేవాలయాలు, గురుద్వారాలకు కొదవ లేదు. అయితే సంరక్షణ లేక చాలా వరకూ శిథిలావస్థల ఉన్నాయి. పురాణాల ప్రకారం ఉమర్ కోట ప్రాంతంలో పశ్చిక మైదానాలు బాగా ఉండేవి. కాబట్టి ఈ ప్రాంతానికి అక్కడి వారు పశువులను మేతకు తీసుకొచ్చేవారు.

అయితే కొన్ని పశువులు ఓ ప్రాంతానికి నిత్యం వెళ్లి పాలిస్తూ ఉండేవి. అదేంటా? అని పశువుల కాపరులు చూడగా.. అక్కడ శివలింగం కనిపించింది. అప్పటి నుంచి అక్కడి హిందువులు ఆ శివలింగానికి పూజలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడి శివలింగం విశిష్టత ఏంటంటే.. ఇది ఇప్పటికీ పెరుగుతూ పోతోంది. అప్పట్లో శివలింగం చుట్టూ వలయాన్ని గీయగా.. ఇప్పుడు శివలింగం ఆ వలయాన్ని దాటేసింది. మహా శివరాత్రి వచ్చిందంటే చాలు.. ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. అక్కడి ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఉమర్‌కోట్ ఉండటానికి పాక్‌లో ఉన్నా ఇక్కడ 80 శాతం మంది హిందువులు ఉన్నారు. ముస్లిం దేశంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు శివమందిరం ప్రధాన కేంద్రంగా ఉండటం విశేషం.

Share this post with your friends
Exit mobile version