
ఏదైనా గ్రహణం సంభవిస్తోందంటేనే ముందుగా ఆలయాలన్నీ మూతబడతాయి. గ్రహణ కాలం ముగిశాక ఆలయమంతా సంప్రోక్షణ చేసిన మీదటే తిరిగి ఆలయాన్ని తెరుస్తారు. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పూజలు నిర్వహించరు. అలాంటిది ఓ ఆలయంలో మాత్ర గ్రహణ కాల సమయంలోనే గ్రహణ శాంతి అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అసలు ఆ ఆలయం ఎక్కడుంది? అంటే అది మనందరికీ తెలిసిన ఆలయమే. శ్రీకాళహస్తి క్షేత్రం. ఇక్కడ రాహు, కేతు, సర్ప నివారణ పూజలు పెద్ద ఎత్తున నిత్యం జరుగుతూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ ఆలయంలో గ్రహణ సమయంలో స్వామివారి దర్శనంతో పాటు పూజలన్నీ అందుబాటులో ఉంటాయి.
తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి క్షేత్రం ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి గాంచిన ఆలయం. ఇక్కడ వాయులింగంగా పరమేశ్వరుడు కొలువుదీరాడు. స్వయంభువుగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వరుడి మహాలింగం 9 గ్రహాలు 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉంటుంది. ఇక రాహు, కేతు, సర్ప దోష నివారణ క్షేత్రంలో అమ్మవారు కొలువై ఉంటుంది. అమ్మవారి నడుముకు నాగాభరణం అలంకారంగా ఉంటుంది. శ్రీజ్ఞాన ప్రసూనాంబిక కాళహస్తీశ్వరాలయం వచ్చేసి గ్రహణ కాలంలో తెరిచి ఉండే ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయంలో దాదాపు 5 దశాబ్దాల క్రితం రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు ప్రారంభమయ్యాయని చెబుతారు.
