
తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం అద్భుతాలకు నిలయం. అసలు ఈ ఆలయం ఎంత స్థలంలోనిర్మితమైందో ముందుగా తెలుసుకుందాం. క్రీ.పూ.12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి.
వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీ మలయప్ప స్వామివారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి. శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు చెందిన రాజులు, రాణులు, సేనాధిపతులు, ఇంకెందరో భక్తులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారు. అద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలు, మండపాలు కొలువుదీరాయి. తిరుమల శ్రీవారి ఆలయంలోని మండపాలను ఆనాటి చక్రవర్తులు, రాజులు అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యంతో నిర్మిచారు. ఇందులో మహాద్వారం, కృష్ణరాయమండపం, రంగనాయక మండపం, తిరుమలరాయ మండపం, అద్దాల మండపం – ఐనా మహల్, ధ్వజస్తంభ మండపం, కళ్యాణ మండపం తదితరాలు ఉన్నాయి.
