
హిందూ ఆలయాలు భారతదేశంలో మాత్రమే కాదు.. ప్రపంచంలోని పలు ఆలయాల్లో కూడా ఉన్నాయి. ముఖ్యంగా నేపాల్ హిందూ దేశం. అక్కడ ఎన్నో పురాతన, ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఈ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాల్లో చెప్పుకోదగినవి చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి.. బుధ నీలకంఠ ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన రహస్యాలు చాలానే ఉన్నాయి. అవి తెలుసుకున్నా కొద్దీ ఆసక్తిని కలిగిస్తాయి.
బుధనీలకంఠ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో శివపురి కొండ మధ్యలో ఉంటుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. విష్ణువుకు అంకితం చేయబడింది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనిస్తూ ఉన్నట్టుగా విగ్రహం ఇక్కడ కొలువుదీరి ఉంటుంది. ఈ బుధ నీలకంఠ ఆలయంలోని స్వామివారి ప్రధాన విగ్రహం నేపాల్లోనే అతిపెద్ద రాతి శిల్పం కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇక్కడి విష్ణుమూర్తి విగ్రహం నీటిపై తేలుతూ ఉంటుంది. ఇది పదేళ్లుగానో.. 50 ఏళ్లుగానో కాదు.. 1300 ఏళ్లుగా నీటిపై తేలుతూనే ఉందట. ఈ పురాతన ఆలయం దాని అందం, అద్భుతాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
