
కేరళకు వెళ్లిన ప్రతి ఒక్కరూ దర్శించుకునే ఆలయాల్లో గురువాయూర్ క్షేత్రం ఒకటి. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు భూలోకంలో వెలసిన దివ్యక్షేత్రమే గురువాయూర్. ఇక్కడ స్వామివారి ఆలయం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచింది. ఈ మహాక్షేత్రంలో కన్నయ్య వేల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నాడు. గురువాయూర్కు వచ్చి శ్రీకృష్ణుడిని దర్శించుకుంటే మోక్షం సులభంగా సిద్ధిస్తుందని నమ్మకం. పరబ్రహ్మమే ఇక్కడ కన్నయ్య రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక్కడి కన్నయ్య విగ్రహాన్ని దేవతల గురువు బృహస్పతి, వాయు భగవానుడు కలసి ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది.
ఈ పుణ్యక్షేత్రాన్ని భక్తులు దక్షిణ ద్వారకగా పిలుచచుకుంటారు. స్వామివారి మూలవిరాట్ రాయితోనూ, లోహంతోనూ తయారుకాకపోవడం మరో విశేషం. మరి స్వామివారి విగ్రహం ఎలా తయారైందంటే.. పడ అంజనం అనే మిశ్రమంతో తయారవుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన విగ్రహాన్ని తనే తయారు చేసుకున్నాడని చెబుతారు. ఆ తరువాత ద్వాపరయుగం చివరి రోజుల్లో తన శిష్యుడైన ఉద్దవునికి ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో యావత్ ప్రపంచం నీటమునడంతో కన్నయ్య విగ్రహాన్ని బృహస్పతి గురువాయూర్లో ప్రతిష్టించారు. ఈ క్రతువులో వాయువు కూడా తన వంతు సహకారం అందించాడట. గురువు, వాయువు కలిసి విగ్రహాన్ని ప్రతిష్టించడంతో గురువాయూర్ అనే పేరు వచ్చింది.
