Site icon Bhakthi TV

జీయంగార్ల పట్టు వస్త్ర సమర్పణ ఎంత ఆసక్తికరంగా జరుగుతుందంటే..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే అణివార ఆస్థానం, చారిత్రక నేపథ్యం, ఉత్సవ విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జీయ్యంగార్ల వస్త్ర సమర్పణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేస్తారు. వీటిలో నాలుగింటిని మూలమూర్తికి అలంకరిస్తారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరిస్తారు.

శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో ‘పరివట్టం’ (చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత అర్చకులు తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయ్య‌ర్ స్వామివారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్య‌ర్ స్వామివారికి, టీటీడీ తరఫున కార్యనిర్వహణాధికారికి ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలిస్తారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచుతారు.

పుష్ప పల్లకిపై ఊరేగింపు..

ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకీపై తిరుమల పురవీధుల గుండా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు.

Share this post with your friends
Exit mobile version