Site icon Bhakthi TV

తిరుమల శ్రీవారి ఆరాధన విధానానికి మూలం వైఖానస భగవత్ శాస్త్రమట..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆరాధన విధానానికి మూలం శ్రీ వైఖానస మహర్షి రచించిన వైఖానస భగవత్ శాస్త్రమని తిరుమల శ్రీ వైఖానస ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ రాఘవ దీక్షితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ, టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం శ్రీ మరీచి మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ రాఘవ దీక్షితులు మాట్లాడుతూ, వైఖానస భగవత్ శాస్త్రం వేదంతో కూడినదని దేవాలయ సంస్కృతికి మూలమైన వేదమంత్రాలతో జరిపే వైఖానస ఆరాధన తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెప్పారు. వేల సంవత్సరాలుగా శ్రీవారికి పూజలు ఉత్సవాలు శ్రీ వైఖానస ఆగమం ప్రకారం జరుగుతున్నాయని, ఈ ఆగమ శాస్త్రాన్ని శ్రీ మరిచి మహర్షి విమానార్చనకల్పం, ఆనంద సహిత గ్రంథాలలో విధివిధానాలతో సమగ్రంగా వివరించారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ సనత్ కుమార్ ప్రసంగిస్తూ, శ్రీ మరీచి మహర్షి అందించిన శాస్త్ర గ్రంథాలపై పరిశోధనలు జరిపి, అందులోని ఆగమ శాస్త్ర ప్రాధాన్యతను, సమాజ హితాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నారు. దేవాలయ, మండపాల నిర్మాణాలను, నిత్య పూజలు, ఆరాధనలు విధివిధానాలు వంటి ఎన్నో శాస్త్ర విషయాలను సమగ్రంగా అందించారని చెప్పారు. దేవాలయ నిర్మాణమే సంస్కారవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందని వివరించారు. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆగమ శాస్త్ర ఆచార్యులు శ్రీ భవనారాయణాచార్యులు మాట్లాడుతూ, మరీచి మహర్షి ఉపదేశించిన విషయాలు, శ్రీ కల్ప సూత్రాల ఆధారంగా రూపొందించబడ్డాయని చెప్పారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైఖానస భగవత్ శాస్త్రంలో చెప్పబడిందని ఈ ఉత్సవ నిర్వహణ, సందర్శన వల్ల భక్తులకు అశ్వమేధ యాగం చేసిన ఫలం లభిస్తుందని తెలిపారు.

తరతరాలుగా బృహత్తరమైన ఈ శాస్త్ర ఆచరణలో వైఖానస అర్చక సమాజం బృహత్తర బాధ్యత పోషిస్తుందన్నారు. శ్రీ వైఖానస ట్రస్ట్ ట్రస్టీ శ్రీ శ్రవణ్ కుమార్ ప్రసంగిస్తూ, భారతీయ సంస్కృతికి మూలం వేదాలు, ఆగమ శాస్త్రాలని, సమాజంలోని మానవాళిని ధర్మం మార్గంలో నడిపిస్తున్నాయన్నారు. శ్రీ మరీచి మహర్షి అందించిన దేవాలయ సంస్కృతి మహోన్నతమైందని వివరించారు. అనంతరం శ్రీ వైఖానస ట్రస్ట్ కార్యదర్శి శ్రీ ప్రభాకర్ ఆచార్యులు ప్రసంగిస్తూ దేవాలయాల విశిష్టత, అర్చన, పూజ విధానాలను వివరించారు. అంతకుముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు స్తోత్ర పఠనంతో మంగళ నిరాజనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారి శ్రీ పురుషోత్తం, ఇతర అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version