శ్రీకృష్ణుడి కోసం ప్రాణమిచ్చిన వెదురుబొంగు వేణువుగా రూపాంతరం చెందింది. శ్రీకృష్ణుడు దానిని నిత్యం తన వద్దనే ఉంచుకునేవాడు. వేణువు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని వెంట ఉండడం గోపికలకు చాల అసూయ కలిగించింది. ‘మేము శ్రీకృష్ణునితో కొంత కాలమే గడప గలుగుతున్నాము. కాని ఈ వేణువు శ్రీ కృష్ణునితో సదా ఉండగలుగుతోంది. కృష్ణుడు దాని తోటే నిద్ర పోతున్నాడు దానితోనే నిద్ర లేస్తున్నాడు. రోజంతా దానినే తన చేతిలోనే ఉంచుకుంటున్నాడు. అని గోపికలు ఆ వేణువు దగ్గరికి వెళ్లి… “నీవు సదా శ్రీ కృష్ణునితో నీవుండగలుగు తున్నావు. దీనిలో రహస్యం ఏమిటో మాకు చెప్పు!” అని అడిగారు.
దానికి ఆ వేణువు ఇలా సమాధానం చెప్పింది… “నేను లోపల అంతా ఖాళీ!అంటే నాకంటూ ఏమీ లేదు నన్ను నేను పూర్తిగా ఆ ప్రభువునకు సమర్పించు కున్నాను. ప్రభువైన శ్రీకృష్ణుడు తానూ ఎప్పడైతే అప్పుడు నాతో ఎలా కావాలనుకుంటే అలా ఉంటాడు. దీనిని పూర్తిగా ‘ఆత్మార్పణం’ అంటారు. నిజానికి మీరెవరు? నేనెవరు? అంతా భగవంతుని రూపాలమే. అందుచే భగవంతుని అనుగ్రహం పొందడానికి మనం మనని భగవంతునికి సమర్పించుకోవడం ఒకటే మార్గం!”అన్నది. ఈ మాటలను విన్న గోపికలు ఆత్మార్పణ మాత్రమే జీవిత పరమావధిగా భావించి జీవనం సాగించారు. మనకు ఏమి కావాలో భగవంతుడుకే మనకంటే బాగా తెలుసు. అందుకే మనల్ని మనం పూర్తి గా ఆయనకు సమర్పించుకుంటే మనకేది మంచిదో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. భగవంతుని అనుగ్రహం పొందడానికి అది మాత్రమే ఏకైక మార్గము.
