Site icon Bhakthi TV

శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రం స్థల పురాణం ఏంటంటే..

తిరుప్పావై ప్రత్యేకం శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రం గురించి తెలుసుకున్నాం కదా. పూర్వం మార్కండేయ మహర్షి, భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసారంట. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా ఉండేదట. అయితే వీరి తపస్సును కాలనేమి అనే రాక్షసుడు ఆటంకం కలిగించేవాడట. విసిగిపోయిన మునులు శ్రీ మహా విష్ణువును ప్రార్థించారట. అప్పుడు నారాయణుడు ఆ రాక్షసులను అంతమొందించి శ్రీదేవి భూదేవి సమేతంగా మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడట. అందుకే స్వామివారికి వటపత్రశాయి అని పేరు వచ్చింది.

ఆ ప్రాంతాన్ని రాక్షస సంహారం అనంతరం మల్లి అనే రాణి పాలించేదట. ఆమెకు విల్లి, పుట్టన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ వేట కోసం అడవికి వెళ్లగా పులితో పోరాడుతూ పుట్టన్ చనిపోగా విల్లి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పుడు విల్లికి స్వామివారు కలలో కనిపించి అటవీ ప్రాంతాన్ని పట్టణంగా మార్చి తనకు ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. ఆలయంలో మర్రిచెట్టు కింద ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పాడట. పుట్టన్‌ను సైతం బతికించాడట. స్వామి చెప్పినట్టుగానే ఆలయ నిర్మాణం గావించి శ్రీదేవి భూదేవి సమేత వట పత్రశాయిని ప్రతిష్టించారు. విల్లి పుట్టన్ పేర్ల మీదుగానే ఈ ఆలయానికి శ్రీవిల్లిపుత్తూర్ అనే పేరు వచ్చిందని స్థలపురాణం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version