
శ్రీ జ్ఞాన సరస్వతి జ్ఞాన సరస్వతి ఆలయంలో బీజాక్షరాల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అసలు ఏంటి బీజాక్షరాల వివాదం? అంటే వాస్తవానికి బాసర అమ్మవారి ఆలయంలో మూడు కార్యక్రమాలే ముఖ్యమైనవి. ఒకటి అమ్మవారి అభిషేకం.. ఈ సమయంలో అమ్మవారి ముఖానికి పసుపు బండారితో అలంకరిస్తారు. అభిషేకానంతరం ఆ పసుపు బండారిని ప్రసాదంగా పంచుతారు. రెండవది పలకపై బియ్యం వేసి అక్షరాభ్యాసం నిర్వహించడం. ఇది అందరికీ తెలిసిందే. మూడవది ప్రతి మంగళవారం తేనెతో అభిషేకం.
ఈ మూడు మాత్రమే బాసర ఆలయ నిర్మాణం నుంచి ఉన్నాయి. కొత్తగా కొందరు వేద పాఠశాలను ఏర్పాటు చేసి బీజాక్షరాలు రాసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ఆలయ అధికారులు, పూజారులకు నచ్చడంలేదు. అసలిది వేదాల్లో కానీ.. ఆలయ పురాణాల్లో కానీ లేదని అంటున్నారు. కాళికామాత కాళిదాసుకు మాత్రమే బీజాక్షరాలతో అక్షర జ్ఞానం ప్రసాదించిందని, అంతే తప్ప బాసర ఆలయంలో అలాంటి నియమమే లేదని అంటున్నారు. ఇలాంటి నియమాల పేరుతో భక్తులను బురిడీ కొట్టిస్తున్నారని ఆలయ అనుష్టాన పరిషత్ ఆరోపిస్తోంది. ఇది బీజాక్షరాల వివాదం.
