
తిరుమల మొదటి కనుమ రహదారిలో అక్కదేవతల గుడి ఉన్న విషయం భక్తులకు తెలిసిందే. ఇక్కడ ఏడుగురు అక్కదేవతలు కొలువై ఉంటారు. ఈ ఏడుగురు అక్కదేవతలకు 13వ తేది ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగం ఆధ్వర్యంలో కార్తీకమాస పూజలు నిర్వహించనున్నారు. అక్కగార్లకు ప్రతి సంవత్సరం కార్తీకమాసపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రేపు కార్తీకమాస పూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ డ్రైవర్లు, స్థానికులు కలిసి ఘనంగా పూజలు నిర్వహిస్తారు.
చారిత్రక ప్రాశస్త్యం
తిరుమల మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణిలు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా ఆ ఆలయంలో పూజలందుకుంటున్నారు. సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయవరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన ఏడుకొండలవాడికే ఆడపడుచులుగా పేరొంది అక్కగార్లు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువు దీరి ఉన్నారు.
