Site icon Bhakthi TV

రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠ్యాభిషేకం..

తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 19 నుంచి జ్యేష్టాభిషేకం జరగనుంది. మూడు రోజుల పాటు అంటే జూన్ 21వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం జరుగనుంది. అభిషేకాలు, పంచామృత స్న‌ప‌న‌ తిరుమంజ‌నాల కార‌ణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ‌ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తులు అరిగిపోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు వైఖాన‌సాగ‌మోక్తంగా నిర్వ‌హించే ఉత్స‌వ‌మే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్స‌వం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గ‌ల‌ కల్యాణ మండపంలో ఈ ఉత్సవం చేపడతారు. దీనిని ‘అభిధేయ‌క అభిషేకం’ అని కూడా అంటారు.

మొదటిరోజు శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత స్వామి, అమ్మ‌వార్ల‌కు వజ్రకవచం అలంకరించి పురవీధుల్లో ఊరేగిస్తారు. రెండో రోజు ముత్యాల కవచ సమర్పణ చేసి ఊరేగిస్తారు. మూడో రోజు కూడా తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. అంతవరకు సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే ఉంటారు. జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21వ తేదీ క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version