Site icon Bhakthi TV

అమ్మవారి వాహనసేవలో ఆకట్టుకున్న శ్రీ వల్లభ కోలాటం, నేత్రపర్వంగా భరతనాట్యం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గజవాహన సేవలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాబృందాల ప్రదర్శనలు భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 13 కళాబృందాలు 268 మంది కళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ కోల్కత్తాకు చెందిన ఏడు మంది కళాకారులు మనిపూరి నృత్యం, కర్ణాటక రాష్ట్రం మైసూర్ కు చెందిన శ్రీ వల్లభ కోలాటం బృందంలోని 35 మంది చిన్నారులు కోఆర్గి నృత్యం చేశారు.

బెంగుళూరుకు చెందిన 28 మంది మహిళా కళాకారుల గజలక్ష్మి నమోస్తుతే – భరతనాట్యం భక్తులకు నేత్రపర్వంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన 60 మంది యువతులు మాతురి డాన్స్, బంజారా డాన్స్, అదిలాబాద్ జిల్లా సంప్రదాయ నృత్యమైన కొంపు లంబా డ్యాన్స్, రాజమండ్రికి చెందిన 30 మంది మహిళలు కేరళ డ్రమ్స్ లయబద్ధంగా వాయిస్తూ మాడ వీధులలో మరింత ఆధ్యాత్మిక శోభను పెంపొందించాయి. తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు అష్టలక్ష్మి వైభవం వేషధారణ, భరతనాట్యం, కోలాటాలు అలరించాయి.

Share this post with your friends
Exit mobile version