
సమస్యలు లేని మనిషంటూ ఉండడు కానీ కొందరికి శక్తిని మించిన కష్టాలు పరీక్షిస్తూ ఉంటాయి. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికి కలియుగ ప్రత్యక్షదైవమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఒక అద్భుత పరిష్కారం. ఇక్కడ శ్రీనివాసులు స్వయంభువుగా వెలిశాడట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుంచి 6 కి.మీ దూరంలో వాడపల్లి గ్రామం ఉంది. ఈ ఆలయానికి మరో పేరు కూడా ఉంది. అదే కోనసీమ తిరుపతి.
స్థల పురాణం ప్రకారం.. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభువుగా వెలిశాడట. మరి ఇక్కడి స్వామివారి ప్రత్యేకత ఏంటంటారా? వాడపల్లి ఆలయాన్ని ఏడు శనివారాల పాటు దర్శించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తే మన కష్టాలన్నీ తీరుతాయట. ప్రదక్షిణలతో పాటు ఏడు వారాల వ్రతం చేసి ఎనిమిదో వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం. అందుకే ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది.
