
దేశ వ్యాప్తంగా నిన్న నాగుల పంచమిని వైభవంగా జరుపుకున్నారు. కానీ ఒక చోట మాత్రం తేళ్ల పంచమిని జరుపుకున్నారు. ఇక్కడ తేళ్ల విగ్రహాలకు పూజలు చేయడమే కాకుండా తేళ్లతో ఆడుకుంటారు. ఇది ఎప్పటి నుంచో అక్కడ వారికి ఆచారంగా వస్తోందట. ఇంతకీ తేళ్ల పంచమి ఎక్కడ జరుపుకుంటారు.. అంటారా? కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో జరుపుకుంటారు. ఈ గ్రామంలోని కొండపై కొండమేశ్వరీ దేవి కొలువై ఉంటుంది. ఇక్కడి వారంతా తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. ఇది అక్కడి వారికి అనాదిగా వస్తున్న ఆచారం. విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసినా తేళ్లు దర్శనమిస్తారట.
పిల్లలు, పెద్దలన్న తేడా లకేండా అందరూ ఈ కొండకు వచ్చి తేళ్లను శరీరంపై ఎక్కించుకుని ఆటలు ఆడుతూ ఉంటారు. తేలు మరి కుట్టదా? అనే సందేహం రావొచ్చు. ఆసక్తికరంగా ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్కరికి కూడా హాని కలగలేదట. ఒకవేళ కరిచినా కూడా వెంటనే అమ్మవారి ఆధారం అంటిస్తారట. దీంతో తగ్గిపోతుందట. ఈ కొండమేశ్వరీ దేవి ఆలయానికి కర్ణాటక నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు వెలుతుంటారు. తేళ్ల పంచమి నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా చూస్తారు.
