
ఇవాళ స్కంద పంచమి. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామి కుమార షష్టి రోజున జన్మించాడు కాబట్టి ఈరోజుని కుమార షష్టిగా కూడా పిలుస్తూ ఉంటారు. అసలు కుమారస్వామి ఎలా అవతరించాడంటే.. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట. అంతే ! మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది.
ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా , సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే. స్కందపంచమి , కుమారషష్టి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా , సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా , రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి , షష్టి తిథులలో స్వామిని తల్చుకోవాలి.
