
విల్లి, గండన అనే ఇద్దరు కోయరాజుల గురించి తెలుసుకున్నాం కదా. విల్లిని పులి చంపేసింది. అతని కోసం వెదికి వెదికి గండన విశ్రాంతి తీసుకోగా.. కలలో అనంత శయనుడు కలలోకి వచ్చి గండన్ని పులి చంపిన వైనాన్ని తెలిపాడు. అలాగే తాను ఎక్కడ ఉన్నది చెప్పాడు. అడవిని సుందర నగరంగా తీర్చిదిద్దమని కోరాడు. గండనకు భగవంతుడు వటపత్రశాయి ఆదేశాన్ని శిరసావహించి ఆ కోయరాజు విల్లి ఒక ఆలయం నిర్మించాడు. ఆ ఆలయం చుట్టూ అనేక అందమైన వీధులను, పెద్ద పెద్ద భవంతులను పలు వృత్తుల వారికి ఆవాసాలను నిర్మింపజేసాడు.
దేవతలే ఆశ్చర్యపడే రీతిలో వటపత్రశాయికి ఉత్సవాలు జరిపించి వృధ్ధాప్యంలో ఆ పరంధాముని సన్నిధికి చేరుకున్నాడు. కొత్తగా నిర్మించబడిన ఊరైనందున ‘పుత్తూరు’ అని అడవిగా వుండే ఆప్రదేశాన్ని నగరంగా నిర్మించిన విల్లి పేరు చేర్చి ఆ వూరికి, విల్లిపుత్తూరు అనే పేరు ప్రచారమయింది. ఆ తరువాత ఆండాళ్ అవతరించిన కారణంగా విల్లిపుత్తూరు శ్రీ విల్లి పుత్తూరుగా మారింది. ఈ ఊరు చుట్టూ వున్న ప్రదేశాలకు కోయరాజు విల్లి తల్లియైన మల్లి పేరుతో మల్లి నాడుగా పిలవబడింది. పన్నెండు మంది ఆళ్వారులలో ప్రముఖుడైన పెరియాళ్వారు ఇక్కడ అవతరించగా వారి పెంపుడు పుత్రికగా ఆండాళ్ అవతరించింది. నేడు ఈ శ్రీ వైష్ణవ క్షేత్రం ‘శ్రీవిల్లిపుత్తూరు’గా విశ్వ విఖ్యాతి చెందినది.
