
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రులోని శివాలయం గురించి తెలుసకున్నాం కదా.. ఇక్కడ శివుడు తలకిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తాడు. అయితే స్థలపురాణం ఆసక్తికరంగా ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతంలో శంబరుడు అనే రాక్షసుడు సంచరించేవాడు. మునులు, ఋషులను హింసించేవాడు. వారంతా యమధర్మరాజు వద్దకు వెళ్లి అతనిని సంహరించమని ప్రార్థించగా శంబరునితో అనేక మార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు. ఓటమిని అవమానంగా భావించిన యముడు శివుడి కోసం అక్కడే ఘోర తపస్సు చేశాడు.
అయితే ఆ సమయంలో పరమేశ్వరుడు యోగ నిద్రలో ఉండటంతో యముడి తపస్సును గుర్తించలేదు. అప్పుడు యముని తపస్సును పార్వతీ మాత గుర్తించి తన శక్తి అంశంను యమధర్మరాజుకు ప్రసాదించిందట. ఆ శక్తితో శంబరునిపై పోరాడిన యముడు అతడిని సంహరించి ఆ విజయానికి గుర్తుగా ఆ ప్రాంతానికి యమపురిగా నామకరణం చేశారు. ఇదే కాలక్రమంలో యమునాపురం గాను ప్రస్తుతం యనమదుర్రుగానూ పిలవబడుతోంది. అయితే ఇక ఆ తరువాత కూడా ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించడానికి వీలు లేకుండా పార్వతి, పరమేశ్వరులను ఇక్కడ వెలియమని యముడు ప్రార్థించాడట. యముని కోరిక మేరకు పార్వతీమాత నెలల పసివాడైన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని పార్వతి దేవి వెలియగా.. శివుడు మాత్రం అలాగే శీర్షాసనం వేసి కనిపిస్తాడు.
