
కొల్హాపూర్ గురించి తెలుసా? ఇక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారికి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం మహారాష్ట్రలోని కొల్హాపుర్లో పంచగంగ నది ఒడ్డున ఉన్నది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. అమ్మవారికి లక్ష్మీదేవి మాత్రమే కాకుండా చాలా పేర్లున్నాయి. స్కాంద పురాణం, దేవీ భాగవతం ప్రకారం అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని కరవీర నగరమని అంటారు. అలాగే ఈ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని కూడా పిలుస్తారు. అంటే విడువలేనిదని అర్థం.
ఇక్కడి ఆలయాన్ని అమ్మవారు ఎప్పటికీ విడిచి వెళ్లదట. అందుకే దీనిని అవిముక్త క్షేత్రమని పిలుస్తారు. ఇక కరవీర మహాలక్ష్మి అని ఎందుకు పిలుస్తారంటే.. అమ్మవారు తన కరములతో ఈ క్షేత్రాన్ని ఎత్తి కొల్హాపూర్ను రక్షించిందట. అందుకే ఈ పేరు వచ్చిందట. ఆది గురువు శ్రీ శంకరాచార్యుల వారు దీనిని దర్శించి శ్రీ చక్రాన్ని.. విద్యాశంకర భారతి ఒక మఠాన్ని నిర్మించారు. ఇక గురు దత్తాత్రేయుడు అయితే ఇక్కడ నిత్యం భిక్ష చేస్తారని అక్కడి వారంతా చెబుతారు. ఇక ఆలయంలో వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, రాధాకృష్ణ, కాలభైరవ, వినాయకుడు, సింహవాహిని, తుల్జాభవాని ఉపాలయాలు ఉంటాయి.
