ప్రతి మాసంలో వచ్చే అమావాస్య.. అలాగే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు చాలా ఇష్టమని చెబుతారు. కాబట్టి ఆ రోజున శ్రాద్ధ కర్మలు చేయడం, తర్పణాలు విడవడం వలన మంచి ఫలితాలు పొందవచ్చునని శాస్త్రం చెబుతోంది. అసలు పితృదేవతలకు అమావాస్యకు ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. పితృదేవతలకు అమావాస్యకు ఉన్న సంబంధం గురించి మత్స్య పురాణం వివరిస్తోంది. ఆ ప్రకారంగా చూస్తే పితృదేవతలు ఏడు గణాలుగా ఉంటాయి. ఈ ఏడు గణాలు.. ప్రాణులకు కావాల్సిన చైతన్యాన్ని, సామర్ధ్యాన్ని ప్రసాదిస్తుంటాయట.
అందుకే పితృదేవతలకు శ్రాద్ధ తర్పణాలు విడిచి పెడుతుండాలి. అయితే వీరికి శరీరం ఉండదు కదా అంటే శరీరం లేని వీరికి అమృతత్వం ఉంటుందని చెబుతారు. పితృదేవతలను ధర్మ పరాయణులుగా పేర్కొంగారు. ఒకానొకసారి ఈ పితృగణాలు శాశ్వతమైన లోకాలను పొందడం కోసం యోగ సాధన చేయడం మొదలు పెట్టాయట. యోగ సాధన అయితే మొదలు పెట్టారు కానీ వారిలో ఏకాగ్రత మాత్రం లేదట. దీంతో వారి సాధనకు భగ్నం కలిగి వారంతా పితృదేవతలుగా మారారట. అలాంటి పితృదేవతలకు ఒక మానస పుత్రిక కూడా ఉంది. ఆమె పేరు అచ్చోద. ఈమె నదీ రూపంగా ఉండేదట.
