
గోవిందుడు అందరివాడేలే.!భగవంతుడిని ఒక్కో మనిషి ఒక్కో తీరున కొలుచుకుంటారు. కొందరు స్వామి నామాన్ని నిత్యం తల్చుకుంటూ కాలం గడిపితే, మరికొందరు తమ ఇష్ట దైవానికి నిత్యకైంకర్యం చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు. ఇంకొందరు స్వామిని ప్రియునిగానూ, తాము ప్రేయసిగానూ భావిస్తూ మధుర భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. చూసేందుకు ఇవి శృంగారంలా తోచినా… జీవాత్మ పరమాత్మల కలయికే వాటి వెనుక ఉండే ఆంతర్యం అంటారు. అలాంటి మధుర భక్తికి ఔన్నత్యాన్ని తీసుకు వచ్చినవాడు ‘జయదేవుడు’. ఆయన చిన్నప్పటి నుంచే కృష్ణభక్తిలో ఓలలాడేవాడు.
ఆ భక్తితోనే కృష్ణుడు తప్ప అన్యమెరుగని ‘పద్మావతి’ అనే దేవదాసీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులిరువురూ నిత్యం కృష్ణ నామస్మరణలోనే మునిగితేలేవారు. మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణ భక్తుడు. ఒడిశా రాష్ట్రంలోని ‘కెంధు బిల్వ’ అనే ప్రదేశంలో ‘భోజదేవుడు, రమాదేవి’ అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణజన్ముడు. భార్య పద్మావతీదేవి. 8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి. ఆయన పాటపాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తనచేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట. భక్తులందరూ భగవానుని పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధచూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’అని ప్రస్తుతించారు.
