
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజు గురువారం ఉదయం సూర్యప్రభ వాహన సేవలో సాంస్కృతిక వైవిధ్యం కనిపించేలా వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సంప్రదాయ కళలను చక్కగా ప్రదర్శించారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి 16 బృందాలు, 405మంది కళాకారులు పాల్గొని తమ కళానైపుణ్యం ప్రదర్శించారు. ఇందులో అస్సాం రాష్ట్రానికి చెందిన జోయ బృందం ప్రదర్శించిన బిహు నృత్యం, పంజాబ్ కు చెందిన రాహుల్ హెగడే బృందం ప్రదర్శించిన గురియో నృత్యం, విశాఖపట్నంకు చెందిన బి.విజయ బృందం ప్రదర్శించిన దాండియా నృత్యం మైమరపింపచేసింది.
తిరుపతి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, కూచిపూడి నృత్యాలు, బెంగళూరుకు చెందిన గౌరీ బృందం ప్రదర్శించిన శ్రీరామ విజయం , రూపశ్రీ బృందం ప్రదర్శించిన ఆదిత్య నమనం, అనకాపల్లికి చెందిన ధనలక్ష్మి బృందం ప్రదర్శించిన శింబు నృత్యం, రాజమండ్రికి చెందిన నాగలక్ష్మి బృందం ప్రదర్శించిన డప్పువాయిద్యాలు ఆకట్టుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళంకు చెందిన కోలాటం బృందాలు ప్రదర్శించిన కోలాటాలు భక్తులను భక్తి పారవశ్యంతో ముంచాయి.
