Site icon Bhakthi TV

తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్..

తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ఈవో జె. శ్యామలరావు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడిఎఐ (ఆధార్ సంస్థ) నుంచి విచ్చేసిన అధికారులు, టీసీఎస్ జియో, టీటీడీ ఐటి విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటి అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఎఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు.

Share this post with your friends
Exit mobile version