Site icon Bhakthi TV

పాతబస్తీలో వైభవంగా రెండో రోజు బోనాల ఊరేగింపు..

పాతబస్తీలో రెండో రోజు బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్నంతా పాతబస్తీలో బోనాల సందడి నెలకొనగా.. ఇవాళ రంగం, భవిష్యవాణి కార్యక్రమాలు జరుగనున్నాయి. మొదటి రోజు అయితే దాదాపు మహిళలంతా బోనాలను సమర్పించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత అవివాహిత మహిళ పచ్చికుండపై అమ్మవారి ఎదురుగా నిలుచుని భవిష్యవాణి వినిపించనుంది. లాల్ దర్వాజా వద్ద రంగం కార్యక్రమానికి ఇప్పటికే అధికారులంతా ఏర్పాట్లు చేశారు. దీనికి ముందు పోతరాజు ప్రదర్శన, గావు పట్టే కార్యక్రమం జరగనుంది. గావు పట్టిన తర్వాత అనురాధ అనే మహిళ రంగం చెప్పనుంది.

ఇవాళ పాతబస్తీలోని అన్ని ప్రముఖ ఆలయాల వద్ద రంగం కార్యక్రమం జరుగనుంది. అనంతరం జరిగే ఘట్టాల ఊరేగింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్కన్న, మాదన్న ఆలయం వద్ద నుంచి అంబారీ పై అమ్మవారి ఘటం ఊరేగింపు జరగనుంది. ఈ ఆలయం వద్ద నుంచి సాయంత్రం 4 గంటలకు అంబారీపై మాతేశ్వరి ఊరేగింపు ప్రారంభం కానుంది. ఈ ఊరేగింపును అనుసరించి అన్ని ఆలయాల ఊరేగింపులు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాల నడుమ ఈ ఊరేగింపు కోలాహలంగా కొనసాగనుంది. నయాపూల్ ఢిల్లీ దర్వాజ వైపుఘట్టాల ఉరేగింపు నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version