
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవంగా శ్లాఘించబడే శ్రీ వేంకటేశ్వరస్వామి శేషపర్వతం ముఖభాగాన్ని వేంకటాద్రి అని, మధ్యభాగాన్ని నృసింహాద్రి అని, వెనుక భాగాన్ని శ్రీశైలంగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. ఈ శేషగిరులు అనేకానేక వృక్షసంపదకు, జీవసంపదకు, జంతుకోటికి ఆలవాలమే కాకుండా అనేకానేక పుణ్యతీర్థాలు కలిగి జలసంపదకు కూడా నిలయంగా ఉంటుంది.
తిరుమలగిరులలో 66 కోట్ల తీర్థాలు!
”పుణ్యతీర్థ” మనగా శుభము కలుగజేయు జలమని భావం. అట్టి పుణ్యతీర్థములు తిరుమల పర్వతశ్రేణుల్లో 66 కోట్లున్నవని బ్రహ్మపురాణం, స్కంధపురాణము తెలుపుచున్నవి. అయితే ఈ తీర్థములను ధర్మరతి, జ్ఞాన, భక్తి వైరాగ్య, ముక్తిప్రద తీర్థములు నాలుగుగా విభజించడమైనది. వీనిలో ముఖ్యమైనవి ఈ విధంగా ఉన్నాయి.
ధర్మరతిప్రద తీర్థములు..
ఈ తీర్థముల దగ్గర నివసించిన లేక స్నానమాచరించిన లేక సేవించిన ధర్మాసక్తి కలుగునని పురాణములు తెలుపుచున్నవి. వీటి సంఖ్య 1008 గా నిర్దేశించడమైనది.
