శ్రీకృష్ణుడిపై గాంధారికి శపించేంత కోపం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే 36 ఏళ్ల తర్వాత యాదవ వంశం నాశనమవుతుందని శపించడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఇంద్ర ప్రస్థంలో 23 సంవత్సరాల పాండవ వైభవం అనుభవించారు. అలాగే అరణ్య అజ్ఞాతవాసాలు 13 సంవత్సరాలు చేరడంతో మొత్తంగా లెక్క 36 సంవత్సరాలకు చేరింది. రాజ్యవిభాగమే జరిగి ఉండక పోతే యుద్ధమే వచ్చి ఉండదు గదా! రాజ్య విభాగమూ, పాండవులకు వైభవమూ ఈ కృష్ణుడి వల్లనే అని ఆమె బాధ. అందుచేత 23+13= 36 సంవత్సరాలు తానూ, తన బిడ్డలూ కృష్ణుడు కారణంగా అనేక బాధలు పడ్డామనీ, ఈయనే ఇంత ఘోర కలికి కారణమనీ ఆమె పట్టరాని ఆగ్రహం పొందింది.
సంఖ్య వరకూ ఎట్లో సరిపెట్టుకున్నా వెంటనే కాక ‘ఇంక 36 సంవత్సరాల నాటికి అనడంలో ఆంతర్యమేమో ఊహకు అందలేదు. ద్వాపర యుగాంతం 36 సంవత్సరాలలో కాబోతున్నదని వాళ్లు గణన చేసి ఉండరని అనుకోలేము. ఆ కాలంలో జ్యోతిష గణన విశేషంగా ఉన్నట్టు భారత గ్రంథ అంతర్గత సాక్ష్యాలున్నాయి.అది పాక్షిక వినాశమే! అపుడు మీ వంశంలో ఎవరూ మిగల గూడదు,మీ యాదవకాంతలు గూడా మా వాళ్ల మాదిరిగానే ఏడ్చి అల్లాడాaని ఆమె కోరిక కావచ్చు. ఒకరి స్వభావాన్ని కష్ట కాలంలో చూడాలి అంటారు.
గాంధారీ ధృతరాష్ట్రుల స్వభావం ఆ వేళలో సుస్పష్టమయింది. వీళ్ళ నైజం కృష్ణుడికి ఎపుడో తెలుసు. ఉద్యోగపర్వంలో రాయబారానికి పోయే ముందు ధర్మరాజు.. ‘మా తండ్రి’ అంటూ రక్త సంబంధ స్నేహాన్ని బట్టి గౌరవం చూపిస్తూ, ‘దుర్యోధనుడి వల్లనే మాకిన్ని కష్టాలు’ అని అన్నపుడు ఒకే మాట అంటాడు శ్రీకృష్ణుడు.
ఆ ధృతరాష్ట్రుడున్ అట్టివాడ. తత్తనయుడ ఏల? అనీ “వారంతా పాముల యట్ల సర్వులకు వధ్యులు” అనీ అంటాడు. శ్రీ కృష్ణుణ్ణి భారత యుద్ధం అయిపోయి, ద్వారకకు మరలి పోతూన్నపుడు ఉదంకుడనే ఋషి ఇట్లనే శపించబోతాడు. కృష్ణుడు జరిగింది చెప్పి, వరమిచ్చి ఆయనను శమింప చేస్తాడు. అత్యంత అధర్మంగా ప్రవర్తించిన అశ్వత్థామను ఒక బ్రాహ్మణుణ్ణి శపించగల యోగీశ్వరుడాయన. అవతార ప్రయోజనం తీరిపోయి, యాదవులు ఆ విధంగా నిర్యాణం చెందవలసి ఉంది గాబట్టి, ఋషుల శాపాన్ని మరలించే యత్నం చేయదలపెట్టలేదు. రాబోయే విపత్తు తెలిసి, ముందే యాదవ వీరులనందరినీ ప్రభాస తీర్థానికి తరలించి వాళ్లకు సద్గతి కలిగించారు.
