ఒక సన్యాసి గోదావరి నది ఒడ్డున.. ఇసుకతో చేసిన శివలింగం ఏర్పాటు చేసుకుని, అక్కడే ధ్యానం చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా కప్పల బెక బెక శబ్దాలు వినిపించాయి. అతడికి ధ్యాన భంగమైంది, వెంటనే లేచి.. “ఓ కప్పల్లారా !.. మీ అరుపుల వల్ల నాకు ధ్యానం భంగం అవుతుందని మీకు తెలియదా?” అన్నాడు.
సన్యాసి మాటలు విన్న మరుక్షణమే కప్పలు బెకబెక శబ్దం ఆపేశాయి. సన్యాసి మళ్ళీ కూర్చుని ధ్యానం మొదలుపెట్టాడు. అప్పుడతనికి ఆకాశవాణి వినిపించింది .. “నీవు కప్పల ప్రార్థనను భంగపరిచావు!” అని.
అప్పుడతడు ఓహో కప్పల బెక బెక కూడా ప్రార్థనే అని గుర్తించాడు. ఆ వెనువెంటనే.. మళ్ళీ లేచి నిలబడి “ఓ కప్పల్లారా! దయచేసి మీరు ప్రార్థన చేసుకోండి! అన్నాడు.
ఆ తరువాత తాను కూడా ధ్యాననిష్ఠుడై కప్పల ప్రార్థన తన ప్రార్థనను ప్రగాఢం చేసిందని తెలుసుకున్నాడు. మీరు ఎంత ఎక్కువ మౌనం పాటిస్తే ఆ మౌనం నుంచి నిజమైన పెరుగుదల అంత ఎక్కువగా ఉంటుందని తెలుసుకుంటారు. దీని నుంచి మనం తెలుసుకోవల్సిందేంటంటే.. మౌనం నుంచే నిజమైన వివేకం ఉదయిస్తుంది.
