హిందూ సంప్రదాయంలో మరణించిన వారి నోటిలో బంగారం పెడతారు. అసలెందుకు అలా చేస్తారో తెలుసుకుందాం. మరణం అంటే కేవలం శరీర వినాశనం మాత్రమేనని చెబుతారు. ఆత్మ అమరమైనదట. అందుకే మరణానంతరం ఆత్మ భూలోక వాసాన్ని ముగించి తెలియని లోకాల వైపు పయనిస్తుందట. అలాంటి ఆత్మకు ‘బంగారం’ ఒక దైవిక కవచంలా పనిచేస్తుందని నమ్ముతారు. గరుడ పురాణం వంటి గ్రంథాలలో.. ఈ పవిత్ర వస్తువుల స్పర్శతో ఆత్మ ఏ విధంగా మోక్షాన్ని పొందుతుందో, యమధర్మరాజు పాశం నుంచి ఎలా విముక్తి లభిస్తుందో వివరించడం జరిగింది.
బంగారానికి దైవిక స్వచ్ఛత ఉంటుందని చెబుతారు. బంగారాన్ని అత్యంత పవిత్రమైన లోహంగా, అగ్ని దేవుని స్వరూపంగా భావిస్తారు. అలాంటి బంగారాన్ని మరణానంతరం వ్యక్తి నోటిలో ఉంచడం వల్ల ఆత్మకు ఆధ్యాత్మిక శుద్ధి కలగడంతో పాటు పరలోక ప్రయాణంలో మార్గదర్శిగా నిలుస్తుందట. బంగారం దైవిక అంశం కాబట్టి, అది ఆత్మను ఉన్నత లోకాలకు తీసుకెళ్తుందట. అలాగే మరణానంతరం గంగాజలాన్ని నోటిలో వేస్తారు. ఇలా చేయడం వలన జీవించి ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ పరమ పావనమైన గంగా జలంతో తొలగిపోతాయట. ఆత్మ ఎటువంటి ఆటంకం లేకుండా శరీరాన్ని విడిచిపెడుతుందట. ఇది దుష్టశక్తుల నుంచి ఆత్మకు రక్షణగా కూడా నిలుస్తుంది.
