Site icon Bhakthi TV

మారేడు దళాలను తొక్కిన పుష్పదంతుడు.. తర్వాతేం జరిగిందంటే..

పుష్పదంతుడు.. చిత్రరథుడి పూదోటలోకి అదృశ్య రూపంలో వెళ్లి పువ్వులు కోస్తూ పరవశించి పోతాడు. అతడిని ఎలాగైనా పట్టుకోవాలని చిత్రరథుడు భటులను నియమిస్తాడు. మారేడు పత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది. దాన్ని కాలితో త్రోక్కితే పరమేశ్వరునికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుందని రాజు భావించాడు. ఓ రోజు పుష్పదంతుడు యథా ప్రకారం అదృశ్య రూపంలో పూదోటలో ప్రవేశించి నిర్భయంగా పూలు కోస్తాడు. అలా కోయటంలో అనుకోకుండానే మారేడు దళాలను కాళ్ళతో తొక్కాడు. అప్పుడు శివుని ధ్యానానికి భంగం ఏర్పడుతుంది. వెంటనే పుష్పదంతునిపై ఆగ్రహోదగ్రుడై పుష్ప దంతుని సర్వ శక్తులను నశింపజేస్తాడు శివుడు.

ఆ కారణంగా అతడు రక్షక భటులకు కనిపించి దొరికి పోతాడు .వాళ్ళు బంధించి చిత్రరధ మహారాజు సమక్షంలోకి తీసుకు వెళతారు. రాజు విపరీతమైన కోపంతో పుష్పదంతుడిని కారాగార శిక్ష విధిస్తాడు. చెరసాలలో బంధించబడిన పుష్పదంతుడు విచారంతో కుమిలి పోతూ, తానేదో అపచారం చేసి పరమేశ్వరునికి ఆగ్రహం కలిగించటం వలన తన దివ్య శక్తులన్నిటినీ కోల్పోయానని గ్రహిస్తాడు. పరమ శివుని సంపూర్ణానుగ్రహం సాధించటానికి చెరసాలలో ఉంటూనే పరమ భక్తి తో శివ మహిమలను వర్ణిస్తూ ‘’శివ మహిమమ్నః స్తోత్రం’’ రాశాడు. స్తోత్రం రచన పూర్తికాగానే పరమేశ్వరుడు, తన మహిమలను పరమాద్భుతంగా వర్ణించినందుకు పరమ ప్రీతి చెంది అనుగ్రహించి పుష్పదంతుని దివ్య శక్తులన్నీ తిరిగి అనుగ్రహిస్తాడు. చెరసాల నుంచి బయటపడిన పుష్పదంత గ౦ధర్వ రాజు చిత్రరథ మహారాజును దర్శించి తాను చేసిన అపరాధాన్ని క్షమించమని ప్రార్ధిస్తాడు. దయాళువు అయిన మహారాజు శాంతించి, క్షమించి పుష్పదంతుని విడిచి పెడతాడు. పుష్పదంతుడు మళ్ళీ తన గ౦ధర్వ లోకానికి చేరుకొంటాడు.

Share this post with your friends
Exit mobile version