కాశీలోని బృహస్పతి ఆలయ పౌరాణిక నేపథ్యం గురించి తెలుసుకుందాం. అంగీరస మహర్షి కుమారుడు అయిన బృహస్పతి దేవగురువు. తన భక్తుడైన బృహస్పతికి పరమేశ్వరుడే కాశీలోని తన ఆలానికి సమీపంలో ఒక ప్రదేశాన్ని ప్రసాదించాడని చెబుతారు. బృహస్పతి దేవతలందరికీ గురువు కాబట్టి, ఆయన స్థానం ఇతర దేవతలందరి కంటే ఎత్తులో ఉండాలి. అందుకేనట.. కాశీలో బృహస్పతి ఆలయం ఇతర దేవతల ఆలయాల కంటే కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. అలా ఉండటం వలన దేవతలందరూ తమ తమ స్థానాల నుంచే బృహస్పతిని నిరంతరం దర్శించుకుంటూ ఉంటారట.
శివుని కోసం బృహస్పతి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశాడట. బృహస్పతి తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడిని చూడగానే బృహస్పతి పారవశ్యంతో శివుడిని స్తుతించడం ప్రారంభించాడట. అదంతా విన్న శివయ్య.. ఎంతగానో సంతోషించి బృహస్పతి దేవతలందరికీ అధిపతి అవుతాడని వరం ఇచ్చాడు. అలాగే బృహస్పతికి మంచి వాక్సుద్ధి ఉంది కాబట్టి అతనికి వాచస్పతి అనే బిరుదును కూడా మహేశ్వరుడు ప్రసాదించాడట. బృహస్పతి సంవత్సరాల తరబడి తపస్సు చేసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడట. అలా బృహస్పతి తపస్సు ఆచరించిన ప్రదేశం అత్యంత పవిత్రంగా మారిందని స్థానికుల విశ్వాసం.
