
అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.
అరుంధత్యననసూయా చ సావిత్రీ జానకీసతి
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం
అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది – ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.
అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు. ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్య. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి..
అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా
అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే అయిదు బాణాలను ఇచ్చాడు. మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా, ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, పరిస్థితిని చక్కదిద్దాడు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.
