యుద్దం అనేది ఎన్నో గొప్ప స్తోత్రాలకు పుట్టినిల్లని సనాధర్మం చెబుతోంది. మహాభారత యుద్ధంలో శ్రీ విష్ణు సహస్రనామం, భగవద్గీత వంటివి పుట్టాయి. రామరావణ యుద్ధ భూమిలో ఆదిత్య హృదయం పుట్టింది. ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నా.. మనసంతా గందరగోళంలో ఉన్నా.. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్న సమయంలో ఆదిత్య హృదయం పఠిస్తే అపారమైన మానసిక శక్తితో పాటు ధైర్యం కలుగుతుందని చెబుతారు. ఆదిత్య హృదయం అనేది రణభూమిలో పుట్టిందనుకున్నాం కదా.. అసలు ఇదెలా పుట్టింది? దీనిని ఎవరు ఎవరికి బోధించారో తెలుసుకుందాం.
వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండ ఆదిత్య హృదయం గురించి చెబుతోంది. శ్రీరామచంద్రుడికి అగస్త్య మహాముని ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడని చెబుతారు. రావణ వధకు ముందు రామునిలో కొంత నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయట. వాటన్నింటినీ ఆదిత్య హృదయం తొలగించి విజయ శక్తిని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించిందని చెబుతారు. ఆదిత్య హృదయానికి అంతటి ప్రభావవంతమైన శక్తి ఉందని చెబుతారు. ఇది సర్వపాపాలను హరించడమే కాకుండా ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలను తొలగించి అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని నమ్మకం.
