అగ్నికి గంధపు చెక్క, తుమ్మ చెక్క అనే తేడాలుండవు. రెండూ సమానమే. అలాగే మనసుకు ప్రపంచ విషయమైనా, భగవంతుడి విషయమైనా ఒకటే. తన సహజ స్వరూపంగా ఉన్నప్పుడు అది ఈ రెండింటిని వదిలేస్తుంది. పాదరసాన్ని చేతితో పట్టుకోవటం ఎలా సాధ్యం కాదో, మనసులో కూడా ఏ విషయాన్ని శాశ్వతంగా నిలిపి ఉంచటం సాధ్యంకాదు. ఉదయం చేసిన పనులన్నింటినీ రాత్రికి మనసు వదిలేస్తుంది. దాన్ని నిద్ర అంటున్నాం. అలాగే మంత్రజపం చేస్తూ వెళ్ళినా కొద్దిసేపటికి తిరిగి అదే జరుగుతుంది.
మనసుకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులు ఉన్నాయి. అందువల్ల మనిషి ప్రతిదీ తాను స్వయంగా తెలుసుకోవాలనుకుంటాడు. అది మనిషి లక్షణం. అటుగా వెళ్తే కుక్క కరుస్తుందని ఎవరైనా చెప్పినా పూర్తిగా నమ్మడు. ఎప్పుడో ఒకసారి ఆ కుక్క వెంటపడితే గానీ ఆ విషయం అర్థంకాదు. ఏదైనా మనంతట మనంగా కనుక్కున్నది జ్ఞానం. మనసు దేన్నైనా వదిలేస్తుందని మంత్రజపంతో మనం స్వయంగా తెలుసుకుంటాం. ఎప్పుడైతే మనసుకి ఉన్న ఈ అలవాటుని నిత్య భగవన్నామ స్మరణ ద్వారా మనం జయిస్తామో అప్పుడు మనసే భగవన్నామంగా మారిపోతుంది.
