ఉజ్జయినిలోని మహాకాళేశ్వర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మూడవది.. అత్యంత మహిమాన్వితమైనదని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్షేత్రం గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మహాకాళేశ్వరుడిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు. దీనికి కారణం ఏంటంటే.. మహాకాళేశ్వర క్షేత్రంలో మహాకాళేశ్వరుడు దక్షిణాభిముఖంగా వెలిసి ఉండటమే. ఈ దేవాలయంలోని గర్భగుడిలో మహాకాళ విగ్రహం పైన ఓంకారేశ్వర మహాదేవ విగ్రహం ఉంటుంది. ఈ క్షేత్రంలోని విగ్రహం ఈనాటిది కాదు. ఎప్పటిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
శివమహాపురాణం ప్రకారం ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడి విగ్రహం అత్యంత ప్రాచీనమైది. 43 లక్షల సంవత్సరాల క్రితం కృతయుగంలో మహాకాళేశ్వరుడు ఆవిర్భవించాడని తెలుస్తోంది. ఈ క్షేత్ర విశేషాల గురించి చెప్పాలంటే.. ఉజ్జయిని మహాకాళేశ్వరుని దేవాలయం ఐదు అంతస్తుల్లో ఉంటుంది. ఆసక్తికరంగా ఇందులో ఒకటి భూ అంతర్భాగంలో ఉంటుంది. దీనిని భస్మ మందిరంగా పిలుస్తారు. అనంతరం మూడు అంతస్థుల్లో శివ లింగాలు ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండే లింగాన్ని మహా కాళ లింగమని.. మధ్యలో ఉండే లింగాన్ని ఓంకార లింగమని.. ఆపైన ఉండే లింగం నాగేంద్ర స్వరూపమయిన లింగం.
