తులసి-ధాత్రి కల్యాణం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం, కార్తిక మాసంలో యోగనిద్ర నుంచి మేల్కొనే శ్రీ మహావిష్ణువుకు తులసి మొక్కతో (వృందా రూపం) వివాహం చేస్తారు. విష్ణువుతోపాటు ఉసిరిని (ధాత్రి) కూడా పూజించడం ఆచారం. ఈ కల్యాణాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని, సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వసిస్తారు.
కార్తిక మాసంలో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో తులసి-ధాత్రి కల్యాణం ఒకటి. ఈ వేడుకను సాధారణంగా కార్తిక శుద్ధ ద్వాదశి రోజున నిర్వహిస్తారు. అందుకే దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. ఈ రోజున తులసి మొక్కకు, ఉసిరి కొమ్మకు వివాహం చేస్తారు.
తులసి-ధాత్రి కల్యాణం ఎలా నిర్వహించాలో మనం తెలుసుకుందాం… సాధారణంగా సాయంత్రం వేళల్లో నిర్వహిస్తారు. మొదటగా తులసి కోటను శుభ్రం చేసి, ముగ్గులు వేస్తారు. తులసి మొక్కకు రంగు రంగుల వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి పెళ్లి కూతురుగా భావిస్తారు. ఉసిరి కొమ్మను విష్ణువుగా భావించి, తులసి మొక్క పక్కన పెట్టి, వాటికి పసుపు, కుంకుమలు పెడతారు. పూజలో తులసి, ఉసిరి మొక్కలను శ్రీ లక్ష్మీనారాయణ సమేతంగా ఆవాహన చేస్తారు. పూజ తరువాత తులసి, ఉసిరి కొమ్మల చుట్టూ సూత్రాన్ని చుట్టి, పూలు, పసుపు, కుంకుమ, గంధం వంటి వాటితో అలంకరిస్తారు. హారతి ఇచ్చి, నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదం పంచుతారు. ఈ కల్యాణాన్ని జరుపుకోవడం వల్ల గృహంలో లక్ష్మీకటాక్షం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు. మరింత విలువైన ఆధ్యాత్మిక సమాచారం కోసం Bhakthi TV ని Subscribe చేసుకోండి.
