Site icon Bhakthi TV

తిరునీర్ ఆలయంలో ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారంటే..

తమిళనాడులోని సేలం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో, నామక్కల్ తిరుచెంగోడే వెళ్లే మార్గంలో కాళీపట్టి కందస్వామి ఆలయంలో తిరునీర్‌ను ప్రసాదంగా సమర్పిస్తారు. దీనిని తీసుకుంటే సకల రోగాలు మాయమవుతాయని నమ్మకం. ఈ తిరునీర్‌ను చెరకు పొట్టుతో తయారు చేస్తారు. ఆలయానికి వచ్చిన చెరకు రైతులు.. తమ పంట బాగా పండితే వచ్చే ఏడాది చెరకు సమర్పిస్తామని మొక్కుకుంటారు. అలా ఇచ్చిన మాట ప్రకారం రైతులు చేరుకుని కాల్చగా వచ్చిన బూడిదను శుద్ధి చేసి ఆలయానికి తీసుకు వస్తారు. ఆలయానికి చెరకును ఇచ్చే ముందు రైతులు చాలా నిష్టగా వ్యవహరిస్తారు.

ఆలయానికి చెరకును ఇచ్చే సమయంలో రైతులు ఉపవాసం ఉంటారు. చెరకుని కాల్చగా వచ్చిన బూడిదను శుద్ధి చేసి సుబ్రహ్మణ్య స్వామి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించిన మీదట ఈ బూడిదతో పవిత్ర జలం తయారు చేస్తారు. అలా తయారు చేసిన తీర్థాన్ని తిరునీర్ తీర్థంగా పేర్కొంటారు. ఈ పవిత్ర తిరునీర్ తీర్థాన్ని సేవిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. పళని వెళ్లలేని వారంతా ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి భక్తులంతా కాళీపట్టి కందస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడి కందస్వామిని పూజిస్తే పళని సుబ్రహ్మణ్యస్వామిని సేవించుకున్నంత ఫలితం దక్కుతుందట.

Share this post with your friends
Exit mobile version