శివకేశవులు లోక రక్షణ కోసం అనేక అవతారాలను దాల్చి రాక్షస సంహారం గావించిన కథలు ఎన్నో తెలుసుకున్నాం. అలాంటి శివకేశవుల నుంచి సైతం తనకు మరణం లేకుండా భండాసురుడు అనే రాక్షసుడు వరం పొందాడు. అతడి ఆగడాలను భరించలేకపోయిన దేవతలు ఆది పరాశక్తిని ఆశ్రయించగా.. అమ్మవారు యోగాగ్ని నుంచి ఉద్భవించింది భండాసుర సంహారం గావించింది. ఇంతకీ ఎవరా భండాసురుడు? అతని కథేంటి వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. భండాసుర సంహారానికి సంబంధించిన ప్రస్తావన వ్యాస మహర్షి రచించిన దేవీభాగవతంలో ఉంది.
భండాసురుడు మరెవరో కాదు.. శివుడు మూడో కన్ను తెరవడంతో మన్మథుడు భస్మమవుతాడు. ఆ భస్మం నుంచి పుట్టిన రాక్షసుడే భండాసురుడు. సతీదేవి దేహత్యాగం తరువాత పరమేశ్వరుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఆ సమయంలో పర్వత రాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని శివుని సేవ కోసం నియమించాడు. అయితే పార్వతీపరమేశ్వరుల వివాహం జరిగితే వారికి పుట్టే సంతానం కారణంగా దేవతలను పీడించుకు తింటున్న తారకాసుర సంహారం జరగాల్సి ఉంది. ఈ దైవకార్యం కోసం దేవతల కోరికపై మన్మథుడు అక్కడకు వెళ్లి చెట్టు చాటు నుంచి శివునిపై మన్మథ బాణం వదిలాడు. అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచి చెట్టు చాటున ఉన్న మన్మథ ఉన్న సంహారం గావించాడు.
