Site icon Bhakthi TV

ఆదిశేషుడి గర్వభంగం చేసిన శివుడు..

మన దేశంలో వినాయకుడి ఆలయాలకు కొదువేం లేదు. ప్రతి ఊరికీ ఒక్కటైనా ఉంటుంది. ఏ పూజైనా.. శుభకార్యమైనా ముందుగా మనం గణపతినే పూజించుకుంటాం. దేశంలో గణపతి నవరాత్రులను నిర్వహించినంత గొప్పగా మరే పండుగను నిర్వహించరంటే అతిశయోక్తి కాదు. ఊరూవాడా అనేక రూపాలలో కొలువుదీరి విఘ్నరాజాధిపతి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే వినాయకుని బొజ్జ చుట్టూ పాము ఉంటుంది. అది చాలా మంది గమనించరు. అంతేకాకుండా వినాయక చవితి కథలో కూడా ఈ పాము ప్రస్తావన ఉంటుంది. అసలు పాము ఎందుకు ఇలా బొజ్జ చుట్టూ ఉంటుందో తెలుసుకుందాం.

గణపతికి యజ్ఞోపవీతం స్థానంలో పాము ఉంటుంది. అలాగే వినాయకుడి పొట్ట చుట్టూ మాత్రమే కాకుండా చేతులకు సైతం పాములు ఉండటాన్ని చూడవచ్చు. ఇలా వినాయకుని శరీరంపై ఆదిశేషుడు ఉండడం వెనుక ఓ పురాణ కథ ఉంది. ఒకసారి కైలాసంలో పరమ శివుడు కొలువుతీరి ఉండగా.. మహర్షులు, దేవతలు, మునులు వచ్చి పరమేశ్వరుని స్తుతిస్తున్నారట. ఆ సమయంలో శివుని తలపై సర్పరూపంలో ఆదిశేషుడు.. తన మనసులో ‘దేవతలందరూ మొక్కే శివుని శిరసుపై తానున్నానని.. తాను గొప్పవాడిని కాబట్టే శివుడు తనను శిరసున ధరించాడని భావించాడట. అందరూ శివుని పాదాల దగ్గర ఉంటే తాను శివుని శిరస్సున ఉన్నాననిని అనుకున్నాడట. దీంతో శేషుడికి అహంకారం పెరిగిందట.

ఆదిశేషుడి మనోభావాన్ని గ్రహించిన శివుడు ఎలాగైనా గర్వభంగం గావించాలని భావించాడట. వెంటనే తన శిరసుపై ఉన్న ఆదిశేషుని తీసి నేలకేసి కొట్టడంతో ఆదిశేషుని ఒక్కో తల పది ముక్కలైందట. వెంటనే ఆదిశేషునికి తప్పు తెలుసుకున్న ఆదిశేషుడు పశ్చాత్తాపంతో శివుని పాదాలను ఆశ్రయించి తనను క్షమించమని వేడుకున్నాడు. కానీ శివుడు మాత్రం ఆదిశేషుని శిరస్సున ధరించేందుకు అంగీకరించలేదు సరికదా పూర్వపు స్థానం కూడా ఇవ్వలేదు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version