తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయం నిత్యకల్యాణం, పచ్చతోరణం అన్నట్లుగా ఉంటుంది. ఏడాదంతా భక్తులతో సందడిగా ఉంటుంది. శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. స్థానికంగా ప్రముఖ ఆలయాలు, తీర్థాలను దర్శించుకుంటూ ఉంటారు. శేషాచలం కొండల్లో భక్తులు చూడాల్సిన తీర్థాల్లో శ్రీవారి పుష్కరిణి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరో రెండు దివ్య తీర్థాల గురించి తెలుసుకుందాం. శ్రీవారి భక్తులు ఎక్కువగా సందర్శించే క్షేత్రం పాపవినాశనం. శ్రీ మలయప్ప స్వామివారే స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెబుతారు. అంత గొప్ప తీర్థం తిరుమల నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాపవినాశం తీర్థంలో స్నానం ఆచరిస్తే ఎలాంటి పాపాలైన తొలగిపోతాయని నమ్మకం కాబట్టి ఇక్కడకు వెళ్లిన వారంతా స్నానమాచరిస్తూ ఉంటారు.
ఇక మనం తెలుసుకోవాల్సిన మరొక తీర్థం ఆకాశగంగ. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఆకాశ గంగ ఉంటుంది. దీని గురించి వేంకటాచల మహత్స్యం వివరిస్తోంది. దీనిలో ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి ఈ తీర్థంలోనే ఒక పుష్కరం పాటు అంటే 12 నెలల పాటు తపస్సు చేసి వెలసిన పుణ్య తీర్థం ఆకాశగంగ తీర్థం. వేంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం ఆంజనేయస్వామి తల్లి అంజనాదేవి ఈ తీర్థంలోనే ఒక పుష్కరం పాటు, అంటే పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేసిందని చెబుతారు. అనంతరం ఆంజనేయస్వామిని గర్భాన ధరించిందట. ఈ తీర్థం నుంచే శ్రీవారి అభిషేకానికి అవసరమైన పవిత్ర జలాలు తిరుమల నంబి వంశస్థులు రజత పాత్రల్లో తీసుకెళ్లడం సంప్రదాయంగా కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఆకాశగంగ తీర్థాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు.
