పంచ కేదారాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకున్నాం కదా. బ్రహ్మ హత్యా పాతకం నుంచి బయట పడేందుకు పాండవులు వారణాసికి వెళ్లగా వారిని అనుగ్రహించకపోగా.. వారి నుంచి తప్పించుకునేందుకు శివుడు ఉత్తరాఖండ్కు పారిపోయాడట. అక్కడ ఎద్దుల సమూహంలో ఎద్దు రూపంలో దాక్కొన్న శివుడిని భీముడు గుర్తించి పట్టుకోబోగా.. తప్పించుకునే క్రమంలో శివుడు భూమిలోకి అదృశ్యమవుతుండగా ఆయన శరీర భాగాలు ఐదు చోట్ల పడిపోయాయి. అవే పంచకేదారాలని తెలుసుకున్నాం. అయితే ఏ ఏ ప్రదేశంలో ఏ శరీర భాగం పడిపోయిందో కూడా తెలుసుకుందాం.
ఎద్దు రూపంలో ఉన్న శివుని శరీర భాగాలు 5 ప్రదేశాల్లో పడిపోయాయి. ఎద్దు వీపు భాగం, కేదార్నాథ్లో, చేతులు తుంగనాథ్లో, ముఖ భాగం రుద్రనాథ్లో, నాభి మధ్య మహేశ్వర్లో, జటాజూటం కల్పేశ్వర్లో పడ్డాయంట.. అలా ఈ ఐదు ప్రదేశాలు పంచ కేదారాలుగా ప్రఖ్యాతిగాంచాయి. అనంతరం ఈ ఐదు ప్రదేశాలను పాండవులు దర్శించుకుని మోక్షం పొందారని చెబుతారు. అనంతర కాలంలో ఈ ఐదు ఆలయాలు పంచ కేదారాలుగా ప్రఖ్యాతి గాంచాయి. ఇవన్నీ చూడటానికి ఒకేలా ఉంటాయి. కానీ ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. దేని విశిష్టత దానిదే. కార్తిక మాసంలో ఈ పంచ కేదారాల గురించి విన్నా, చదివినా, దర్శించుకున్నా కూడా శివుడి అనుగ్రహం లభిస్తుందట.
