గుజరాత్ పోరుబందర్లో ఉన్న కుచేలుని ఆలయం సుదాముడు–శ్రీకృష్ణుల స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనం. బాల్యక్రీడలలో సాహచర్యం చేసుకున్న సుదాముడు, తన పేదరికాన్ని అనుభవిస్తూ… శ్రీకృష్ణుని కలుసుకోడానికి అటుకుల మూట తీసుకువెళ్తాడు. కృష్ణుడు అడగకముందే ఆ అటుకులను ఆరగించి, సుదాముని ఇంటిని అపార సంపదతో నింపుతారు. ఇక్కడి కృష్ణ-కుచేల ఆలయంలో నైవేద్యంగా సమర్పించిన అటుకులను ప్రసాదంగా అందిస్తారు. భక్తులు ఈ ప్రసాదాన్ని స్వీకరించి, మిగిలిన అటుకులను ఇంట్లో ధనధాన్యాల వద్ద ఉంచడం ద్వారా సిరిసంపదలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఇది కేవలం నమ్మకం కాదు, నిరూపితమైన సత్యమని అనేకమంది భక్తులు చెబుతారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని అటుకుల ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ఇలాంటి వారిలో ఎందరి జీవితాల్లోనో మార్పులు వచ్చాయని, తాము అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో సంపదను పొందినట్టుగా కూడా చెబుతారు. కుచేలుని ఆలయం సంపద, భక్తి, స్నేహానికి అద్భుత ఉదాహరణగా చెప్పవచ్చు.


