కొబ్బరికాయ విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నారికేళ దీపం ఎలా పెట్టాలి? అసలు ఎప్పుడు పెట్టాలి? వంటి విషయాలను తెలుసుకుందాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత చిప్ప నుంచి కొబ్బరిని వేరు చేసిన మీదట.. కొబ్బరి చిప్పలో వెలిగిచే దీపమే నారికేళ దీపం. కార్తిక మాసంలో తప్పనిసరిగా దీనిని వెలిగిస్తారు. ఇది వెలిగిస్తే శివానుగ్రహం తప్పక లభిస్తుందట. ముందుగా స్వచ్ఛమైన మనసుతో కొబ్బరికాయ కొట్టి చిప్పలను వేరు చేసి దానిని పసుపు నీటితో శుభ్రం చేయాలి. ఆ తరువాత ఒక పెద్ద పళ్లేన్ని తీసుకుని దానిలో నిండుగా బియ్యం పోయాలి.
శుభ్రం చేసుకున్న కొబ్బరి చిప్పకు ఐదు చోట్ల గంధం, కుంకుమ బొట్టు పెట్టి బియ్యంపై పెట్టాలి. అనంతరం దీపారాధన కోసం కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులను తూర్పు, ఉత్తరం, ఈశాన్యం వైపులా ఉంచి అగరుబత్తితో మూడింటినీ వెలిగించాలి. ఇక మిగిలిన రెండవ కొబ్బరి చిప్పను స్వామివారికి నైవేద్యంగా వాడాలి. అంటే ఏదైనా స్వీటు తయారుచేసి దానిని కొబ్బరిచిప్పలో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. నారికేళ దీపం వెలిగించే సమయంలో “దారిద్య్ర దుఃఖ దహనాయ నమః శివాయ!” అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే తప్పనిసరిగా శివానుగ్రహం లభిస్తుందట..
