హిందూ సంప్రదాయాల్లో ప్రకృతిని దైవ స్వరూపంగా భావిస్తారు. ఈ క్రమంలోనే చెట్లను దైవ స్వరూపాలుగా భావించి పూజించే సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా కొన్ని తిథులు, కొన్ని పవిత్రమైన మాసాల్లో వివిధ రకాల దేవతా వృక్షాలను పూజించుకుంటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందనేది హిందువుల విశ్వాసం. ఈ క్రమంలోనే కొన్ని చెట్లను పూజించడం వలన మనకేమైనా గ్రహదోషాల వంటివి ఉంటే అవి కూడా తొలగిపోతాయని చెబుతారు. మన పెద్దలు ఏర్పాటు చేసిన ఈ ఆచారాల వెనుక పర్యావరణ పరిరక్షణ అనే రహస్యం ఇమిడి ఉంది.
ఈ క్రమంలోనే పవిత్రమైన కార్తిక మాసంలో ఎలాంటి చెట్లను పూజించాలి? దానివల్ల కలిగే ఫలితాలు ఏంటనేది తెలుసుకుందాం. దేవతా వృక్షాలు కూడా ఉంటాయి. అవేంటంటే.. మన పురాణాల ప్రకారం కొన్ని రకాల చెట్లను దేవతా వృక్షాలుగా పిలుస్తారు. ఆ చెట్లకు అనారోగ్యాన్ని దూరం చేసే అద్భుతమైన శక్తి ఉండటం వలన ఆ పేరు వచ్చిందని చెబుతారు. అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. తులసి, రావిచెట్టు, శమీవృక్షం, అశోక వృక్షం, మర్రి చెట్టు, ఉసిరి చెట్టు, దేవదారు వృక్షం, పారిజాత వృక్షం, సంతాన వృక్షం, కల్పవృక్షంలను దేవతా వృక్షాలని పురాణాలు చెబుతున్నాయి.
