
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమయ్యాయి. ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ముందుగానే సకల ఏర్పాట్లూ ఆలయ అధికారులు నిర్వహించారు. ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి క్షేత్ర బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను తెలుసుకుందాం. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడు. దీనిని నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా చెబుతారు. ఇక్కడ స్వామివారు ఐదు రూపాల్లో కొలువై పంచనరసింహుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.
యాదగిరిగుట్టలో ఇవాళ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనంతో నేడు బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు, వేద పండితులు శ్రీకారం చుట్టారు. 11 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. 20 నుంచి 26 వరకు స్వామివారికి వివిధ అలంకార సేవలు.. ఫిబ్రవరి 24న స్వామివారి ఎదుర్కోలు, ఫిబ్రవరి 25న స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 26న దివ్యవిమాన రథోత్సవం వేడుక.. ఫిబ్రవరి 28న గర్భాలయంలోని మూలవరులకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నారు. సహస్ర ఘటాభిషేకంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
